ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడేమో.. రాయి దాడిపై జగన్ ఫస్ట్ రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 07:13 PM

విజయవాడలోని మేమంతా సిద్ధం ర్యాలీలో తనపై జరిగిన రాయిదాడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గాయం కారణంగా మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ఆదివారం విరామం ఇచ్చిన జగన్.. సోమవారం తిరిగి ప్రారంభించారు. యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గానికి చేరుకున్న వైఎస్ జగన్.. తనపై జరిగిన రాళ్లదాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలోని నాగవరప్పాడు వద్ద జరిగిన మేమంతా సిద్ధం సభలో తన గాయం గురించి జగన్ మాట్లాడారు.


"ఒక్క జగన్ మీద టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇంతమంది కలిసి దాడులు చేస్తున్నారు. ఎంతమంది దాడి చేసినా మీ బిడ్డ అదరడు, బెదరడు. ఎందుకంటే మీ బిడ్డ కురుక్షేత్రంలో అభిమన్యుడు కాదు అర్జునుడు. కురుక్షేత్రంలో అర్జునుడి మీద ఒక బాణమేస్తే ఆయన భయపడలేదు. జగన్ మీద ఒక్క రాయి వేసినంత మాత్రాన వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఈ స్థాయికి వారు దిగజారంటే.. ఎన్నికల్లో విజయానికి వైసీపీ ఎంత దగ్గరగా ఉందో.. విపక్షాలు ఎంత దూరంగో ఉన్నాయో తెలుస్తోంది. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు" అని వైఎస్ జగన్  అన్నారు.


" నా నుదుటి మీద వారు చేసిన గాయం.. పదిరోజుల్లో తగ్గిపోతుందేమో కానీ.. పేద ప్రజలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. వారు మర్చిపోరు. నా నుదుటి మీద వారు చేసిన ఈ గాయంతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడేమో అనిపిస్తోంది. గాయపరచటం, మోసం చేయటం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే.. ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజం. చంద్రబాబుకు తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయడం ఒక్కటే. చంద్రబాబును నమ్మడం అంటే చెరువుల్లో చేపలకు కొంగలను కాపలా పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే. ఆయన్ని నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టేడమే"అని వైఎస్ జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com