ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులకరాయి విసిరిన చేయి తెలియాలంటే మొదట వాళ్లపై విచారణ చేయాలి: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 07:17 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయి దాడి ఘటనపై జరుగుతున్న పోలీసు దర్యాప్తు మీద జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దాడికి బాధ్యత వహించాల్సిన అధికారులతోనే.. ఘటనపై దర్యాప్తు జరపడం ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ ఘటనపలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.


" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సీఎం ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదు. ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


"సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి.. ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై ఇప్పటికే జనసేన, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసినట ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com