పెడన నియోజకవర్గ టికెట్ వస్తుందని ఆశించానని రాకపోవడంతో కొంత నిరాశ చెందానని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నానని చెప్పారు. 2019లోనే పెడన నుంచి పోటీ చేస్తానంటే చంద్రబాబు మాటకు గౌరవం ఇచ్చి పోటీ నుంచి తప్పుకున్నానని తెలిపారు. 2024లో టికెట్ ఇస్తానని ఆనాడే చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత పొత్తుల్లో పెడన టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం జరిగిందన్నారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశానని చెప్పారు. గతంలో పీఆర్పీలో తాను నష్టపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పానని గుర్తుచేశారు. ఆయన కూడా తన పట్ల సానుకూలత చూపించారని కానీ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. పెడన టికెట్ని మరొకరికి ఇచ్చారని దీంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.