ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాను తలదన్నేలా బిష్ణోయ్ లవ్‌స్టోరీ.. ప్రేయసి సజీవదహనం తర్వాత డాన్‌గా ఎలా ఎదిగాడు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 11:27 PM

లారెన్స్ బిష్ణోయ్. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గ్యాంగ్‌స్టర్‌గా ఉత్తర భారతదేశం మొత్తాన్ని భయపెడుతున్న లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యలతో దేశం మొత్తం పరిచయం అయ్యాడు. అయితే తాను జైలులోనే ఉన్నా.. అనుచరులతో ఈ హత్యలు చేయించడం.. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బహిరంగంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగడం, కాల్పులు జరపడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే సంపన్న కుటుంబం, మంచి ఉన్నత చదువులు చదివిన లారెన్స్ బిష్ణోయ్.. స్టూడెంట్ రాజకీయాలు, ప్రేయసి మరణం, చెడు స్నేహంతో పూర్తిగా గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు.


31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా ధత్తరన్‌వాలీలో 1993లో లారెన్స్ బిష్ణోయ్ జన్మించాడు. లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బాల్‌కరణ్ బరార్. హర్యానా పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కుమారుడే ఈ లారెన్స్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్‌ది సంపన్న కుటుంబం. అతని కుటుంబానికి కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి. అబోహర్‌లోని కాన్వెంట్ స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తన క్లాస్‌మేట్‌పై లారెన్స్ బిష్ణోయ్ ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత చండీగఢ్ డీఏవీ కాలేజీలో ఉన్నత చదువులు చదివే సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.


ఇక పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ రాజకీయాల్లోకి లారెన్స్ బిష్ణోయ్ అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ-ఎస్ఓపీయూని స్థాపించాడు. అయితే కాలేజీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం చేతిలో ఓడిపోవడంతో లారెన్స్ బిష్ణోయ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కాలేజీ రాజకీయాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేవాడు.


డీఏవీ కళాశాలలో లా కోర్సు చేసిన లారెన్స్ బిష్ణోయ్.. జాతీయ స్థాయి అథ్లెట్‌గా, పంజాబ్‌ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌గా ఉన్నాడు. అక్కడే గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడగా.. వీరిద్దరూ కలిసి చిన్న చిన్న నేరాల వైపు మళ్లారు. ఈ క్రమంలోనే 2011లో బిష్ణోయ్ గ్రూప్‌కు ప్రత్యర్థులకు మధ్య ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కాస్తా హింసకు దారి తీశాయి. అయితే ఈ గొడవల్లోనే లారెన్స్ బిష్ణోయ్ లవర్‌ను ప్రత్యర్థి వర్గం సజీవంగా దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ప్రేయసి మరణం తర్వాత.. పలువురు స్టూడెంట్ లీడర్లపై ప్రతీకారం తీర్చుకున్నట్లు బిష్ణోయ్ పేర్కొన్నాడు.


2018లో సంపత్‌ నెహ్రా అనే వ్యక్తితో కలిసి సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ కుట్ర చేయడంతో వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు ఉన్నారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో ఈ లారెన్స్ బిష్ణోయ్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. లారెన్స్ బిష్ణోయ్ జైల్లోనే ఉన్నా.. అతని గ్యాంగ్‌ మాత్రం నేరాలకు పాల్పడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌, ఫ్రెండ్ గోల్డీ బ్రార్‌లు కెనడా నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com