ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖలీస్థానీ పన్నూ హత్యకు కుట్ర.. ‘రా’ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 11:29 PM

ఖలీస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై దర్యాప్తు సాగిస్తోన్న అమెరికా.. భారత నిఘా విభాగం మాజీ అధికారిపై తాజాగా అభియోగాలు నమోదుచేసింది. ఇప్పటికే ఈ కేసులో భారత్‌‌కు చెందిన నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తిని అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపైనా అభియోగాలు నమోదవడం చర్చనీయాంశమవుతోంది. పన్నూ హత్య కుట్రకు అతడే మార్గదర్శకత్వం వహించినట్లు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో వెల్లడించింది.


 ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. అందులో రా మాజీ అధికారి, భారతీయుడు వికాస్‌ యాదవ్‌ (39)పై మనీలాండరింగ్‌, కుట్రకు కిరాయి వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక వంటి అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియరావడం లేదని పేర్కొంది. భారత విదేశీ ఇంటిలెజెన్స్‌ విభాగం ‘రా’ నిర్వహించే క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో వికాస్ యాదవ్ పనిచేశారు.


‘అమెరికాలో నివాసం ఉంటూ.. రాజ్యాంగబద్ధంగా సంరక్షించిన హక్కులను పొందిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి హింసాత్మక చర్యలను లేదా ఇతర ప్రయత్నాలను ఎఫ్‌బీఐ ఎన్నటికీ సహించదు’ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని గతేడాది మే మొదటి వారంలో అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్యకు నిఖిల్‌ గుప్తా కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. పన్నూ హత్య పథకాన్ని అమలు చేయడానికి నిఖిల్ గుప్తాతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.


గత నవంబరులో భారత్‌కు వస్తుండగా.. చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని పరాగ్వే విమానాశ్రయంలో నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు. అక్కడ జైలులో ఉన్న నిఖిల్‌ను అమెరికాకు అప్పగించినట్లు ఆ మధ్య మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇదే కేసులో భారత ప్రభుత్వానికి సైతం అమెరికా కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. అయితే, ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికా విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది.


ఈ అభియోగాల్లో పేర్కొన్న అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని భారత్ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ బృందం పర్యటన ముగిసిన తర్వాతే వికాస్‌ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు నమోదు చేయడం గమనార్హం. పన్నూను హత్య చేస్తే లక్ష డాలర్లు ఇస్తానని నిఖిల్ గుప్తాతో ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు అడ్వాన్సుగా 15,000 డాలర్లు చెల్లించారని ఆరోపించింది. ఈ లావాదేవీలు న్యూయార్క్ సమీపంలో కారులో జరిగాయని అభియోగాల్లో తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com