పెందుర్తి సమీపంలోని దొగ్గవానిపాలెంలో గల రాయల్ అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్లో సోమవారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విలువైన గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలిపోవడంతో సుమారు రూ.18 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. దొగ్గవానిపాలెంలోని రాయల్ అపార్టుమెంటులోని మూడో ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఫ్లాట్ యజమాని తల్లి రాత్రి పది గంటల సమయంలో స్నానం చేస్తుండగా, ముందుగా వంటగదిలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫ్లాట్ యజమాని సతీశ్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సెల్లార్లో ఉన్నారు. ఫ్లాట్లో మంటలు వ్యాపించాయంటూ సతీశ్కు తల్లి వీడియో కాల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఆయన వెంటనే ఫ్లాట్కు చేరుకుని ఆమెను సురక్షితంగా బయటకు తెచ్చాడు. కాగా మంటలు ఫ్లాట్ అంతటా వ్యాపించడంతో అపార్ట్మెంటు వాసులు నీళ్లతో ఆర్పేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మర్రిపాలెం నుంచి అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటుకు చేరుకుని ఇతర ఫ్లాట్లకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల ఫ్లాట్లోని టీవీ, ఫ్రిజ్, ఏసీ, గీజర్, తదితర విలువైన గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. కప్ బోర్డులు, సీలింగ్, వంటగదిలోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. పది నిమిషాల్లోనే ఇంట్లోని సామగ్రి అంతా కాలి బూడిదైందని సతీశ్ తెలిపారు. సుమారు రూ.18 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.