ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ యువరాజు భార్య వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్‌కు క్యాన్సర్.. స్వయంగా వెల్లడి

international |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:53 PM

ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్డన్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని కేట్ మిడిల్టన్ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆమె కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆమెకు ఇటీవలె ఒక ఆపరేషన్ జరగగా.. ఆ తర్వాత బయటకు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే కేట్ మిడిల్టన్ కోమాలో ఉన్నారని.. అంతే కాకుండా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమే స్వయంగా బయటికి వచ్చి విషయాన్ని వెల్లడించారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.


42 ఏళ్ల కేట్‌ మిడిల్టన్‌కు శస్త్రచికిత్స జరిగిందని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అయితే ఆ శస్త్రచికిత్స తర్వాతే కేట్‌కు క్యాన్సర్ బయటపడిందని తాజాగా ఆమె తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో భాగంగా కిమో థెరపీ చేయించుకుంటున్నానని చెప్పారు. క్యాన్సర్ గురించి తెలియగానే తాను షాక్‌కు గురైనట్లు కేట్ వివరించారు.


 అయితే తమ పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని ముగ్గురు పిల్లలకు చెప్పడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించారు. అప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్నానని.. ఆ తర్వాత కోలుకుని కిమో థెరపీ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. మరింత దృఢంగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమ ప్రైవసీని గౌరవించాలని కేట్ మిడిల్టన్ విజ్ఞప్తి చేశారు.


కేట్ మిడిల్టన్, విలియంలకు 2011లో పెళ్లి జరగ్గా.. వారికి జార్జ్‌, చార్లట్‌, లూయిస్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక వారికి ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా వివరించినట్లు చెప్పారు. తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని.. క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు వారికి చెప్పినట్లు వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన భర్త విలియం చాలా మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. తమపై ప్రజలు చూపించిన ప్రేమ ఎంతో విలువైందని.. క్యాన్సర్ చికిత్స పూర్తయ్యేవరకు తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని కేట్ మిడిల్టన్ కోరారు.


ఇప్పటికే బ్రిటన్‌ కింగ్, విలియం తండ్రి ఛార్లెస్‌-3 క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కోడలు కేట్ మిడిల్టన్‌కు కూడా క్యాన్సర్‌ సోకింది. కేట్ మిడిల్టన్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నానని స్వయంగా చేసిన ప్రకటనపై విలియం సోదరుడు హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మెర్కల్ స్పందించారు. కేట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రిటన్ రాజకుటుంబ సభ్యులైన హ్యారీ, మేఘన్.. కొన్నేళ్ల క్రితం రాజరికపు విధుల నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com