ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్.. ప్రధాని మోదీని ఏమన్నారంటే

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:52 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఇక ఆప్ నేతలతోపాటు దేశంలోని ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు, ఇతర పార్టీల నేతలు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత తొలిసారి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు.


ట్విటర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిన సునీతా కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీది అధికార దురహంకారమని మండిపడ్డారు. అదే అధికారంతో దేశంలో ప్రతిపక్ష నేతలు అందరినీ అణిచివేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీకి 3 సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అధికార అహంకారంతో మోదీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌-ఈడీతో అరెస్టు చేయించారని పేర్కొన్నారు. అధికార అండ చూసుకుని అందరినీ అణిచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.


ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహమని.. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల వెంటే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయినప్పటికీ.. జైలు లోపల ఉన్నా బయట ఉన్నా.. అరవింద్ కేజ్రీవాల్ జీవితం దేశానికే అంకితం చేశారని సునీతా కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు. ప్రజలకు ప్రతిదీ తెలుసని.. జై హింద్ అంటూ సునీతా కేజ్రీవాల్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజలందరినీ అణచివేయాలని ప్రధాని చూస్తున్నారని విమర్శలు చేశారు.


ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ.. ఆయనకు జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్‌ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com