ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లెలో దారుణం.. ఆస్తి కోసం తల్లిదండ్రులపై కుమారుడి దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 09:39 PM

నవమాసాలు మోసిన కన్నతల్లి.. భుజాలపై ఎక్కించుకుని మోసిన తండ్రి. ఆస్తి కోసం అక్కసుతో దారుణంగా దాడి చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బి కొత్తకోట మండలం బయప్పగారిపల్లె పంచాయతీ గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలు మదనపల్లెలోని అయోధ్యనగర్‌లో ఓ కళ్యాణ మండపంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు మనోహర్‌రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటుండగా.. చిన్న కుమారుడు శ్రీనివాసులురెడ్డి మదనపల్లెలోని భవానీనగర్‌లో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు.


ఈ కుటుంబానికి మూడెకరాల పట్టా, రెండెకరాల డీకేటీ భూమి ఉంది. ఆస్తి పంపకాల విషయంలో కొన్ని రోజులుగా శ్రీనివాసులురెడ్డి సోదరుడితో, తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2న తల్లిదండ్రులతో ఘర్షణకు దిగి వృద్ధులనీ చూడకుండా దారుణంగా దాడి చేశాడు. తల్లి జుత్తు పట్టుకుని ఈడ్చుకెళుతూ పిడిగుద్దులు కురిపించాడు. వారించిన తండ్రి గుండెలపైనా తన్ని, చెంపలపై కొట్టాడు. తనను కొట్టొద్దని కొడుకును ఆ తల్లి వేడుకుంటున్నా.. కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టాడు.


గుర్తుతెలియని వ్యక్తులు రికార్డు చేసిన ఈ సంఘటన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మదనపల్లె పోలీసులు స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసులురెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com