ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత,,,,మార్చి తొలి వారంలోనే అధికంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 09:38 PM

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని.. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈసారి వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గతేడాది జూన్‌ నాలుగో వారం వరకు వేసవి తీవ్రత కొనసాగింది. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఏపీలో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పులలకు అవకాశం ఉందంటున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.


సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయంటున్నారు. ఎల్‌నినో పరిస్థితులు కూడా జూన్‌ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్‌నినో ఉంటుందని అంచనా వేస్తున్నారు.


అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఎండలు ఉపశమనం పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com