ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దృశ్యం సినిమా రేంజ్‌లో హత్యకు ప్లాన్.. కారు కారణంగా అంతా రివర్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 08:39 PM

అనంతపురం జిల్లాలో దృశ్యం తరహా సీన్ రిపీటైంది. డబ్బుకోసం స్నేహితుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఓ వ్యక్తి.. దాని నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సాక్ష్యాలు మాయం చేసేందుకు కూడా ట్రై చేశారు. కానీ.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతపురానికి చెందిన మహమ్మద్ అలీ, రఫీ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావటంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో వ్యాపారంలో నష్టపోయిన డబ్బును తిరిగి చెల్లించాలంటూ అలీ.. రఫీపై ఒత్తిడి తేవటం ప్రారంభించాడు. ఇంటికి వెళ్లి మరీ గొడవలు పడటం మొదలెట్టాడు. దీంతో అలీ మీద కోపం పెంచుకున్న రఫీ.. అలీని అడ్డు తొలగిస్తే ఈ గొడవేదీ ఉండదని భావించాడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదనే దుర్బుద్ధితో మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఓ సుపారీ గ్యాంగ్‍‌తో అలీ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ గ్యాంగ్‌కు 50 వేలు కూడా ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగ్.. అలీని చితకబాది, చేతులు, కాళ్లు కట్టేసి వెళ్లిపోయారు.


అయితే సుపారీ గ్యాంగ్ దాడితో అలీ చనిపోయాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని మాయం చేసి, ఆధారాలు లేకుండా చేసేందుకు రఫీ తీవ్రంగా ప్రయత్నించాడు. తన బావ, సోదరితో కలిసి శవాన్ని మాయం చేసేందుకు రఫీ మాస్టర్ ప్లాన్ వేశాడు. అలీ సెల్ ఫోన్ తీసుకుని, శవంతో పాటు కారులో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ కారు చెడిపోవటంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో ఆంబులెన్స్ లో అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో రఫీ నిర్మి్స్తున్న కొత్త ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో శవాన్ని నారాయణపురం సమీపంలో ఉన్న శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి కాల్చివేసి ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. అయితే బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మనిషి.. ఆ తర్వాత తిరిగి రాకపోవటంతో అలీ కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. లోతుగా దర్యాప్తు జరిపితే హత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 11మందిని అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు.. వారి వద్ద నుంచి కారు, 2 బైక్ లు, లాప్ టాప్, 5 మొబైల్ ఫోన్లు, 35 వేల నగదు, స్వాధీనం చేసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com