ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ సాయంపై మంత్రి రోజా వర్సెస్ టీడీపీ.. సోషల్ మీడియాలో రగడ, వీడియోతో ట్రోల్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 07:32 PM

ఏపీని మిచౌంగ్ తుఫాన్ వణికించింది.. ఉమ్మడి చిత్తూరుతో పాటుగా కోస్తా జిల్లాలను వణికించింది. ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. అయితే సోషల్ మీడియా వేదికగా తుఫాన్ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి రోజా, తెలుగు తమ్ముళ్ల మధ్య రగడ మొదలైంది. మంత్రి రోజా టీడీపీ టార్గెట్‌గా ఓ ట్వీట్ చేయగా.. టీడీపీ కేడర్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు. ఓ వీడియోతో వరద సహాయక చర్యలపై మంత్రి రోజాను టార్గెట్ చేశారు. మంత్రి రోజా.. 'మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్నచందంగా ఉంది టీడీపీ నాయకుల పరిస్థితి. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి ఓర్వలేక తెలుగుతమ్ముళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పచ్చమీడియాతో పిచ్చి కూతలు, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దమ్ముంటే వాళ్ళ హాయంలో చేసిన సహాయం గురించి మాట్లడకుండా చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారు' అంటూ ట్వీట్ చేశారు.


మంత్రి ట్వీట్‌కు తెలుగు తమ్ముళ్లు కౌంటర్ ఇచ్చారు. రోజా వర్షంలో గొడుగుతో రికార్డ్ చేసిన ఓ రీల్ వీడియోతో కౌంటర్ ఇచ్చారు. నగరి టీడీపీ ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్ ఈ వీడియోతో 'మీ సహాయక చర్యలు భలే ఉన్నాయండి.. ఇలా చేపట్టాలి సహాయక చర్యలు' అంటూ కౌంటర్ ఇచ్చారు. మిగిలిన తెలుగు తమ్ముళ్లు కూడా ఈ వీడియోతో మంత్రిని టార్గెట్ చేశారు. ఓ వైపు తుఫాన్, వర్షాలతో జనాలు ఇబ్బందిపడుతుంటే మంత్రి ఇలా రీల్స్ చేయడం ఏంటి అంటూ కొందరు రోజాను టార్గెట్ చేశారు. మొత్తానికి తుఫాన్ సహాయక చర్యలు వ్యవహారంపైనా ట్విట్టర్‌లో పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే టీడీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్న మంత్రి రోజా వీడియో ఎప్పటిది అన్నది క్లారిటీ లేదు. మరోవైపు తుఫాన్ పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తుఫాన్ బాధితు ప్రజలకు తక్షణ అవసరమైన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. తుఫాన్‌పై ప్రభుత్వ సన్నద్ధతా లేదు.. బాధితులకు సాయమూ లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుఫాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టేలేదని.. ప్రభుత్వ స్పందన సరిగా లేదని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు చంద్రబాబుకు చెప్పారని టీడీపీ అంటోంది.


తుఫాన్ ప్రభావంపై దాదాపు 12 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలి అని సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు దేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని.. ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. దీనికి క్షేత్ర స్థాయి పరిస్థితులే నిదర్శనం అని మండిపడ్డారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా...ప్రజలను అలెర్ట్ చేయడంలో విఫలం అయ్యారని... వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి అన్నారు.


విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించామన్నారు చంద్రబాబు. హుదూద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా నష్ట పరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలన్నారు. తెలుగు దేశం హయాంలో విపత్తుల సమయంలో సాయం పెంచి ఎలా ఇచ్చిందీ.. ఈ ప్రభుత్వం ఎలా కోతలు పెట్టిందీ అనే విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com