ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంటకు 7 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న తుఫాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:58 PM

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళఖాతంలో కోనసాగుతోంది. ఉత్తర దిశగా ముందుకు కదులుతోంది. ఇది దక్షిణ కోస్తా తీరాన్ని అనుకుని కోనసాగుతోంది. తీరం ప్రాంతంలో ఉన్న ల్యాండ్‌ను కూడ తాకుతూ వెళ్తోంది. నెల్లూరు ప్రాంతంలో కొంత ల్యాండ్ మీదుగా పయనించింది. ఇది ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం చెన్నైతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిగంటల్లో బాపట్ల సమీపంలో తీరాన్ని తాకే ఆవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు.. కొన్ని సార్లు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ’మిచౌంగ్‌’ తుఫాన్‌ అన్నదాతల గుండెల్లో అలజడి రేపుతోంది. ఈ ఏడాది వరి సాగుకు శ్రీకారం చుట్టిన తర్వాత తీవ్ర వర్షాభావంతో ఇబ్బంది పడ్డ రైతులను తుఫాన్‌ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌లోని నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, వి. మాడుగుల మండలాల్లో సుమారు 11 వేల హెక్టార్లు వరి సాధారణ విస్తీర్ణం కాగా, 9900 హెక్టార్లలో పంట వేశారు. వర్షాభావంతో 550 హెక్టార్లలో పంట ఎండి పోయింది. తెగుళ్లు బెడద కారణంగా దిగుబడిపై ప్రభావం పడింది. ఇప్పుడు తుఫాన్‌ కారణంగా చాలా చోట్ల పంట పనల మీద ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గొలుగొండ మండలంలో అధిక శాతం పంట కోతలు పూర్తి చేసినట్టు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. మిగిలిన మండలాల్లో కొంత మేర వరి పనలు కుప్పలు పెట్టుకున్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో తుఫాన్‌ పట్టుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిలబడకుండా కాలువలు తవ్వుకుంటున్నారు. ఈదురు గాలులకు నర్సీపట్నం మండలం బలిఘట్టం ప్రాంతంలో వరి చేను నేల కొరిగింది. కుప్పలు పెట్టిన సాంబా మసూరి రకం వరికి మొలకలు వచ్చే అవకాశం ఉన్నందున ఉప్పు నీటిని పిచికారీ చేయాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఏడో తేదీ వరకు వరి పంట కోతలు ఆపాలని రైతులకు చెపుతున్నారు. కోతలు అయిపోయి కుప్పలు పెట్టుకుంటే తడవ కుండా టార్పాలిన్‌లు కప్పుకోవాలని సూచిస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఈపీడీసీఎల్‌ ఏడీ సత్యానందం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుఫాన్‌ సమయంలో ఇంటి గృహోపకరణాలు స్విచ్‌ ఆఫ్‌లో ఉండాలని తెలిపారు. పరిసర ప్రాంతాలలో చెట్లు, విద్యుత్‌ ఫోల్స్‌, తీగలు తెగి పడిపోతే కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబరు 1912కు ఫోన్‌ చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com