ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడులు.. వైద్య సేవలకు తీవ్ర అంతరాయం

international |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 10:05 PM

అమెరికాలో సైబర్ నేరగాళ్లు థ్యాంక్స్‌గివింగ్ సెలవు రోజున రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామాల్లోని 30 ఆసుపత్రుల్లో అర్డెంట్‌ హెల్త్‌ సంస్థ వైద్య సేవలను అందజేస్తోంది. ఈ సంస్థ సేవలు కొనసాగిస్తోన్న ఆస్పత్రుల్లోని మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్ సోమవారం హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో క్లినికల్‌, ఫైనాన్షియల్‌ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. అలాగే, అత్యవసర విభాగాల్లోని రోగులను వేరే ఆస్పత్రులకు తరలించారు.


సైబర్ దాడులపై స్పందించిన ఆర్డెంట్. సాఫ్ట్‌వేర్‌ సేవల్ని పునరుద్దరించడానికి తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అప్పటి వరకు సాధారణ వైద్యసేవలు కొనసాగుతాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ వార్డుల్లోని రోగులకు మాత్రం ఇతర ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపింది. అత్యవసర పరిస్థితి లేని సర్జరీలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. అయితే, సైబర్‌ దాడిలో ఎలాంటి సమాచారం చోరీకి గురైందో ఇప్పుడే చెప్పలేమని, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది.


‘కొన్ని అత్యవసర, ఎంపిక ప్రక్రియలను రీషెడ్యూల్ చేస్తున్నాం.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థను పునరుద్దరించే వరకూ కొంతమంది అత్యవసర రోగులను ఇతర ఏరియా ఆసుపత్రులకు మళ్లిస్తున్నాం.’ ఆర్డెంట్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఓక్లహోమాలోని హిల్‌క్రెస్ట్ హెల్త్‌కేర్, న్యూ మెక్సికోలోని లవ్‌లేస్ హెల్త్, టెక్సాస్‌లోని యుటి హెల్త్‌లు సైబర్ దాడులకు ప్రభావితంమైన వాటిలో ఉన్నాయి. రోగుల ఆరోగ్య సంరక్షణ రికార్డులను ట్రాక్ చేసే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను సైబర్ దాడి ప్రభావితం చేసిందని హాస్పిటల్ అధికారులు చెప్పారు.


ఈ దాడి తమ నెట్‌వర్క్‌ను ఆఫ్‌లైన్‌లోకి తీసుకువెళ్లిందని ఆర్డెంట్ తన ప్రకటనలో తెలిపింది. దీనిపై థర్డ్-పార్టీ ఫోరెన్సిక్, ఇంటెలిజెన్స్, దర్యాప్తు అధికారులకు నివేదించినట్లు కంపెనీ పేర్కొంది. హెల్త్‌కేర్ ప్రొవైడర్ల కార్యకలాపాలకు అంతరాయం కలిగించే రాన్‌సమ్‌వేర్ దాడులు సర్వసాధారణం అవుతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎమ్సిసాఫ్ట్‌ నిపుణుడు బ్రెట్ కాలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అమెరికాలో కనీసం 35 దాడులు జరిగాయని చెప్పారు. డ్యూటీలో తక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారని హ్యాకర్లు విశ్వసించినప్పుడు సాధారణంగా సెలవు కాలాల్లో దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com