ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్షసాధిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్కిల్ డెవలెప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అన్నారు. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంభందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అన్నారు. 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా అన్నారు. మళ్లీ తప్పుల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని.. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.
చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. '45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు.. అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే.. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడేది లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు' అన్నారు. చంద్రబాబు అరెస్ట్ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని.. అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని.. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు వైఎస్సార్ పార్టీ అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు. అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.