మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ దగ్గర ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వెంటనే ఆయన్ను విజయవాడకు తరలించారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ (APSSDC) కేసులో రూ.241 కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు స్కిల్స్ డెవలప్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ను తీసుకొచ్చారు. మొత్తం రూ.3,356 కోట్లలో ప్రభుత్వ వాటా 10 శాతం.. సీమెన్స్ సంస్థ 90 శాతం పెట్టుకుంటుందనే కాన్సెస్ట్. సీమెన్స్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రావాల్సిన నిధులు రాకపోయినా.. మొత్తం 5 విడతలుగా ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదలచేసింది.
చంద్రబాబు ఆదేశాలతోనే ఈ డబ్బులు విడుదలైందనే అభియోగం. స్కిల్కి సంబంధించి ఎలాంటి పనీ జరగలేదని.. ఎక్కడా ఎలాంటి శిక్షణ కూడా లేదని చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్ల డబ్బులు విదేశాలకు వెళ్లి, తిరిగి దాదాపు 70 షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి, తిరిగి దేశానికి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు మీద నాన్బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం. ఐపీసీ సెక్షన్ 120(B), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109.. r/w 34, 37 ఐపీసీతో పాటు 12, 13(2) r/w 13(1)(c)&(d) అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసుల్లో ప్రస్తావించారు. అరెస్ట్కు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు సీఐడీ పోలీసులు. ఆ తర్వాత చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడకు తీసుకెళ్లారు.
తన అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారన్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని.. తానేం తప్పు చేశానని ప్రశ్నించారు. తాను ఆధారాలేవీ అని అడిగానని.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా అన్నారు ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు.