ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఆయనను కలిసేందుకు వస్తున్న ప్రముఖులను పోలీసులు అనుమతించించట్లేదు. ఈ నేపథ్యంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా అనుమతి దొరకలేదు. అయితే.. చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు జనసేనాని స్పెషల్ ఫ్లైట్ అరెంజ్ చేసుకున్నారు. అయితే.. ఏపీ పోలీసులు మాత్రం పవన్కు బిగ్ షాకిచ్చారు.
బేగంపేట్ ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్కు రెడీగా ఉండగా... ఈ విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు, గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు ప్రత్యేక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని.. అందుకే పవన్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల లేఖను పరిగణలోకి తీసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు.. పవన్ ఫ్లైట్ ల్యాండింగ్కు పర్మిషన్ నిరాకరించారు. ఇదే విషయాన్ని హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు అధికారులు చేరవేశారు. దీంతో.. పవన్ ప్రయాణించాల్సిన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్కు కూడా పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఇక చేసేది ఏం లేకపోవటంతో.. పవన్ స్పెషల్ నిలిచిపోయింది. విమానం నిలిపివేయడంతో పవన్.. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. మరి పవన్ కల్యాణ్ ఎలా విజయవాడ చేరుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఫ్లైట్కు పర్మిషన్ ఇవ్వకపోవటంతో.. రోడ్డు మార్గంలోనే పవన్ విజయవాడకు వెళ్తారా.. మరేదైనా స్ట్రాటజీ ఆలోచిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు. పవన్ రాకను అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.