తెలంగాణ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 50 వేల కోట్లు కేటాయించి.. ఇప్పటికే రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇవాళ ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో పత్తి దిగుబడి చాలా వరకు తగ్గిందన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తే.. వాతావరణం అనుకూలించకపోవటంతో ఆశించినంతగా దిగుబడి రాలేదని అన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఈ ఏడాది 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తాము అంచా వేసినట్లు చెప్పారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి పంటను కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి రైతుల్ని మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పత్తి, మిర్చి పంటల సాగుపైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి పెడితేనే అధిక లాభాలు పొందవచ్చునని.. రైతులకు కొన్ని సూచనలు చేశారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే ఆశించింనదానికంటే అధిక లాభాలొస్తాయని వివరించారు. ఇక నుంచైనా రైతులు పామాయిల్ సాగు వైపు మెుగ్గు చూపాలన్నారు.
ఇక రైతు భరోసా పథకం అమలుపై మంత్రి తుమ్మల ఇటీవల కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ యోగ్యంకాని భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చేది లేదని చెప్పారు. ఈ పథకం అమలు, విధివిధానాల ఖరారుపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. ఆ కమిటీ నివేదిక తర్వాత వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు.