ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టణాలకూ నక్షా పటాలు.. గృహాలు, ఆస్తుల గుర్తింపు.. ముందుగా ఈ టౌన్లలోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 06:59 PM

సాగు భూములకు నక్షా పటాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భూములకు సరిహద్దులు, దారులు, బావులు, సర్వేనెంబర్లు ఇలా సమాచారం అంతా ఆ నక్షా పటాల్లో ఉంటుంది. నక్షా పటాల ఆధారంగానే సాగు భూముల సర్వే నిర్వహిస్తుంటారు. సాగు భూములకు ఉన్నట్లుగానే.. పట్టణాలకు సైతం నక్షా పటాలు రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా పైలట్‌ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో నక్షా పటాలు రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరున నిధులు విడుదల చేసింది.


తెలంగాణలో ఎనిమిది పట్టణాలను పైలట్‌ ప్రాజెక్టు కింద నక్షా పటాలు రూపొందించేందుకు ఎంపిక చేశారు. ఈ పట్టణాల్లో సమగ్ర సర్వే నిర్వహించి... పట్టణాంలోని గృహలు, ఆస్తులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలతో పటాలు తయారు చేయనున్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా, మున్సిపల్, భూమి కొలతలు-దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సంయుక్తంగా ఈ పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం నేషనల్‌ జియోస్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌ (NAKSHA- నక్షా) కింద పట్టణాలకు నక్షాలను రూపొందించనున్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత తెలంగాణలో ఎంపిక చేసిన పట్టణాలైన మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు, జడ్చర్ల, కొడంగల్, వర్ధన్నపేట, హుస్నాబాద్, మహబూబాబాద్‌లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్ల సాయంతో ఫోటోలు తీస్తారు. అనంతరం వాటి పరిశీలన పూర్తి చేసి.. క్షేత్రస్థాయిలో సర్వే చేపడతారు. అందులో భాగంగా పట్టణాల్లోని ప్రతి ఇంటిని, ఆస్తిని పక్కాగా సర్వే చేయనున్నారు. అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులను గుర్తించనున్నారు. అనంతరం వాటి విస్తీర్ణాలను డిజిటల్‌ పద్ధతిలో నమోదు చేస్తారు.


ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి ఇల్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులను మంజురూ చేయనున్నారు. ఈ కార్డుల వల్ల ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వమే హద్దులతో కూడిన కార్డులు అందించడం వల్ల ఆస్తులపై బ్యాంకు లోన్లు పొందే అవకాశం కలుగుతుంది. బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో చిన్న చిన్న ఇండ్లు, స్థలాలకూ సైతం పక్కాగా పటాలు రూపొందిచనున్నారు.


ఇక ఈ నక్షా సర్వేతో ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీ నాలాలు, చెత్త డంపింగ్‌ కేంద్రాలు, నీటి వనరుల విస్తీర్ణాల కొలతలు పక్కాగా తేలనున్నాయి. సర్వే ఆధారంగా వాటికి హద్దుల సైతం గుర్తించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలూ కూడా తేలనున్నాయి. డిసెంబరు నాటికి పైలట్‌ సర్వే పూర్తి చేసే అవకాశాలున్నాయని సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మెుత్తంగా 142 పట్టణాల్లో నక్షా సర్వే చేపట్టాలన్న ప్రణాళిక ఉందని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com