ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీ దుంపతెగ ఇదేం పనిరా బాబు.. గణనాథుడుని కూడా వదలరా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:21 PM

గణేష్ చతుర్థి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు భక్తుల నుంచి ఘనమైన పూజలందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ వాడ వాడల మండపాలు ఏర్పాటు చేసి గణపయ్యకు పూజలు చేస్తున్నారు. ఇక మన దగ్గర గణేషుడికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో.. లంబోదరుడి చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. వినాయకుడితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డూ కూడా తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకుంటుంది. వినాయకుడిని చివరి రోజు తల్లి గంగమ్మ ఒడికి చేరిస్తే.. లడ్డునూ మాత్రం వేలం వేస్తారు. లడ్డూను దక్కించుకున్నవారిని మన దగ్గర అదృష్టవంతులుగా భావిస్తారు.


లడ్డూను దక్కించుకున్న వ్యక్తులకు, కుటుంబానికి సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి విశేషం ఉన్న లడ్డూ విషయంలో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకోకుండానే కొందరు లడ్డూలను ఎత్తుకెళ్లిపోతున్నారు. మండపాల్లోని వినాయకుడి చేతిలోని లడ్డూను సైలెంట్‌గా తస్కరిస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో ఓ దొంగ గణనాథుడిని చేతిలోని లడ్డూను ఎత్తికెళ్లిపోయాడు.


హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ వారు మండపాన్ని ఏర్పాటు చేశారు. శనివారం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గణపతి చేతిలో భారీ లడ్డూను ఉంచారు. అయితే ఒక్క రోజు కూడా గడవకముందే శనివారం రాత్రి ఆ లడ్డూ చోరీకి గురైంది. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఓ దొంగ గణేషుడి చేతిలోని లడ్డూను సైలెంట్‌గా ఎత్తుకెళ్లిపోయాడు. ఉదయం మండపానికి వెళ్లిన అపార్ట్‌మెంట్ వాసులకు లడ్డూ కనిపించలేదు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ దొంగ లడ్డూను ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. గణనాథుడి చేతిలో లడ్డూ దొంగతనం జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదని.. వారిని కూడా వదలకుండా చోరీ చేస్తున్నారని మండిపడుతున్నారు.


అయితే గతంలోనూ చాలా సార్లు ఇలా గణపయ్య చేతిలో లడ్డూలు దొంగతనానికి గురయ్యాయి. గణేషుడి చేతిలో లడ్డూ దొంగతనం చేస్తే మంచిదని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు విశ్వసిస్తారు. 'గణపతిబప్ప మోరియా.. హాలా లడ్డూ చోరియా' అంటూ లడ్డూ దొంగతనంపై స్లోగన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాచుపల్లిలోని అపార్ట్‌మెంట్‌లో లడ్డూ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నివాసాలు, బ్యాంకులను దోచేసిన దొంగలు ఇప్పుడు వినాయకుడి మండపాల్లోనూ చోరీలకు పాల్పడుతుండటంతో మీ దుంపతెగ ఆ దేవుడిని కూడా వదలరా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com