ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. అడ్డుకున్న వరద బాధితులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:37 PM

ఖమ్మం పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.


ఖమ్మం జిల్లా దంసలాపురంలో కిషన్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్నారు. వరదలకు తాము సర్వం కోల్పోయినా.. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్ రెడ్డని బాధితులు నిలదీశారు. తమ గోడును పట్టించుకునే వారే లేరని వాపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహిళలకు నచ్చజెప్పటంతో వారు శాంతించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని కిషన్ రెడ్డికి పొంగులేటి వివరించారు. ఈ మేరకు వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇండ్లు కోల్పోయిన పేదవారికి తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేయాలని, వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయడం, వంట పాత్రలు, విద్యార్థులకు పుస్తకాలు, నిత్యవసర సరుకుల సరఫరా వంటివి ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అందాల్సిన సాయం బాధితులకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎంఇక ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం చేరుకున్నారు. సొంత నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com