తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు తలమానికమైన సింగరేణిపై దృష్టి పెట్టింది. సింగరేణి ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. సింగరేణిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సింగరేణిలో పని చేసే బదిలీ వర్కర్లకు యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లు(శాశ్వత ఉద్యోగులు)గా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.
సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో 190 రోజులు భూగర్భ గనుల్లో, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు ఒకటి నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్లు బలరాం స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తోంది. ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తోంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. కార్మికులంతా క్రమశిక్షణతో పనిచేయాలని సీఎండీ ఎన్.బలరామ్ కోరారు. సింగరేణిలో ఒకేసారి 2364 మందిని జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తున్నామని బలరామ్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతకు సింగరేణి సంస్థ నిధులను ఖర్చుచేయనున్నారు. ఈ సంస్థ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు(డీఎంఎఫ్టీ) సమకూరిన నిధులను వినియోగించనున్నారు. నెలకు రూ.13 కోట్లను సింగరేణి సంస్థ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమచేయనుంది. రాష్ట్రంలోని 26,287 స్కూళ్లకు నెలకు రూ.13.61 కోట్లు కానుండగా, 10 నెలలకు రూ.136.10 కోట్లు ఖర్చుచేస్తారు. తాజాగా మూడు నెలలకు సంబంధించి రూ.40.83 కోట్లను విడుదల చేయాలని మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ అధికారులు సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాశారు. డీఎంఎఫ్టీ నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చుచేయాల్సి ఉండగా, నిబంధనలను అతిక్రమించి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఖర్చుచేస్తుంది.