తెలంగాణలో గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తుండగా... చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా వాయుగుండం మారటానికి మరో 24 గంటల సమయం పడుతుంది.
దీని ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మరో మాడ్రోజులు రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ప్రధానంగా మంచిర్యాల, జగిత్యాల, , ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, హైదరాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నేడు హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇప్పటికే ఉదయం నుంచి నగరంలో జల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని రాత్రి సమయానికి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రంలో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. పలుచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. పగటివేళ యావరేజ్ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.