ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 09:34 PM

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలన్నారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.


కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జూ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. నగరం వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్ నగర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలన్నారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.


హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com