తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు అలర్ట్. పలు ట్రైన్లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని ట్రైన్లు దారి మళ్లించారు. సెప్టెంబరు చివరి వారం నుంచి ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుందని అధికారులు చెప్పారు. వరంగల్-హసన్పర్తి-కాజీపేట F క్యాబిన్ మధ్యలో అభివృద్ధి పనులు జరుగుతుండంతో 94 ట్రైన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల జరుగుతున్నాయని అందుకే ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపారు.
కొన్ని ట్రైన్లు కనిష్ఠంగా ఒక రోజు, మరికొన్ని ట్రైన్లు గరిష్ఠంగా 15 రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని చెప్పారు. 41 ట్రైన్లను దారిమళ్లించి నడుపనున్నట్లు పేర్కొన్నారు. మరో 27 ట్రైన్ల ప్రయాణ వేళలనూ మార్చినట్లు వెల్లడించారు. రద్దయిన ట్రైన్లలో సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ వంటి పలు ట్రైన్లు ఉన్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా రాకపోకలు మరికొన్ని ట్రైన్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రద్దయిన ట్రైన్ల వివరాలు ఇవే..
కాజీపేట-సిర్పుర్టౌన్ ( ట్రైన్ నెంబర్ 17003) రైలు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 7 వరకు, సిర్పుర్ టౌన్-కాజీపేట ( ట్రైన్ నెంబర్ 17034) సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 8 వరకు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.
సెప్టెంబరు 29-అక్టోబరు 8 వరకు భద్రాచలం రోడ్-బళ్లార్ష ( ట్రైన్ నెంబర్ 17033), బళ్లార్ష-కాజీపేట ( ట్రైన్ నెంబర్ 17004) ట్రైన్లు రద్దు చేసినట్లు చెప్పారు.
సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు గుంటూరు-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్ 17201), సికింద్రాబాద్-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్లు రద్దు చేశారు.
సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 7 వరకు సికింద్రాబాద్-సిర్పుర్ కాగజ్నగర్, సిర్పుర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ (ట్రైన్ నెబంర్లు 12757/12758) రద్దు చేశారు.
సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 2 గుంటూరు-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్ 12705), సికింద్రాబాద్-గుంటూరు (ట్రైన్ నెంబర్ 12706) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లు రద్దు చేశారు.
సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 7 వరకు విజయవాడ-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్ 12713), సికింద్రాబాద్-విజయవాడ( ట్రైన్ నెంబర్ 12714) శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్లు రద్దు చేశారు.
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. పనులు పూర్తయిన తర్వాత యథావిధిగా ట్రైన్లు కొనసాగుతాయని అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.