బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీరం దాటకముందే తెలుగురాష్ట్రాలపై వరుణుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక.. హైదరాబాద్లో ఉదయం నుంచే ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే రెండు గంటల పాటు జంట నగరాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది.
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా శనివారం సాయంత్రానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీరం దాటే సమయంలో తీరం వెంబడి 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది
ఈ క్రమంలోనే.. తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు తెలంగాణలో 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అదికారులు సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే.. సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. గంట గంటలు హెడ్ క్వార్టర్స్కు అప్డేట్స్ ఇస్తుండాలని ఆదేశించారు.