కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యంతోనే మధ్యమానేరు, లోయర్ మానేరు డ్యాంలు ఎండిపోతున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మానకొండూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా ఇకనైనా నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలని, లోయర్ మానేరు నింపితే సూర్యాపేట వరకు చెరువులు నింపే వీలుంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేదని చెబుతున్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
నవంబరులో వరి పొలాలకు నీరు ఎక్కువగా అవసరముంటుందని, వెంటనే నీళ్లు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంతానికి పోయి నీళ్లు ఎత్తిపోయడం లేదని, యాసంగి పంటకు అసలు నీళ్లు వస్తాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కేసీఆరుకు పేరు ప్రతిష్ఠలు వస్తాయనే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయని, ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 1.75 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయన్నారు. కనీసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోసి మధ్యమానేరుకు తరలించినా, అక్కడి నుంచి ఎల్ఎండిలోకి, తద్వారా కాకతీయ కెనాల్ నుంచి తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, ఎల్కతుర్తి, కమలాపూర్, హుజురాబాద్, వరంగల్, హన్మకొండ, తొర్రూర్ వరకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, మాజీ మేయర్ రవిందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జడ్పీటీసీ శేఖర్ గౌడ్, నాయకులు దేవేందర్ రెడ్డి, జక్కుల నాగరాజు యాదవ్, ఆశోక్ రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు.