భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కుమారుడు కన్నతల్లిని హత్య చేశాడు. తాను చనిపోతే తల్లి బాగోగులు చూసుకనేవారు ఎవరూ ఉండరని భావించి.. ఆమెను హత్య చేసి తాను ఆత్మహ్యత చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తుల్జా కుమారికి (55) కుమారుడు వినయ్ (27) ఒక్కడే సంతానం. పదేళ్ల క్రితం కుమారి భర్త చనిపోయాడు. అప్పట్నుంచి తల్లి,కుమారుడు మాత్రమే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
అయితే గత రెండేళ్లుగా కుమారి ఆరోగ్యం బాగుండటం లేదు. తరుచూ అనారోగ్యం బారినపడుతున్నారు. తల్లికి చికిత్స చేయించేందుకు వినయ్ తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అయితే ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. దీంతో వినయ్ మరింతగా కుంగిపోయాడు. 'నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని వినయ్ తనలో తానే మాట్లాడుకునేవాడు. ఈక్రమంలోనే శనివారం (జులై 27) అర్ధరాత్రి తల్లి కుమారిని వినయ్ హత్య చేశాడు. ఇంట్లోనే గొంతు నులుమి ఆమెను చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయం తలుపులు తెరవకపోటవంతో చుట్టుపక్కల వాళ్లు అనుమానంతో పగులగొట్టి చూడగా.. కుమారి విగతజీవిగా పడి ఉంది. వినయ్ కూడా ఊరేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసకుంది. తెలిసినవారి అంత్యక్రియలకు వెళుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దామరగిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామానికి చెందిన రాములు తెలిసిన వారి అంత్యక్రియలకు బైక్పై ఇంటి నుంచి బయల్దేరారు.
యానగుంది నుంచి మహబూబ్నగర్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు... ఆశన్ పల్లి గ్రామ శివారులో రాములు ప్రయాణిస్తున్న ఢీకొట్టింది. ప్రమాదంలో రాములు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రాములకి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు రాములు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. యాక్సిడెంట్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాములు మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.