ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆప్షన్స్ ట్రేడింగ్ నష్టాల్లో తెలంగాణ టాప్.. ఏపీ సెకండ్.. సెబీ షాకింగ్ రిపోర్ట్

business |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:25 PM

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈజీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడడం, హైరిటర్న్స్ అందుకోవాలనే ఆలోచనతో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, సరైన అవగాహన లేక చాలా మంది నష్టపోతుంటారు. స్టాక్ మార్కెట్లలో కేవలం షేర్లు కొనడమే కాదు చాలా రకాల ట్రేడింగ్ జరుగుతుంది. అందులో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఒకటి. అయితే, ఇందులో చాలా రిస్క్ ఉంటుందని, చిన్న మదుపరులు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ హైరిటర్న్స్ కోసం వాటిలో ట్రేడింగ్ చేస్తుంటారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసే ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారని స్వయంగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానే తెలపడం గమనార్హం.


తాజాగా మరో నివేదిక విడుదల చేసింది సెబీ. ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఒక్కో వ్యక్తి సగటు నష్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉన్నట్లు సెబీ తెలిపింది. ఒక్కో వ్యక్తి సగటున రూ.1.97 లక్షలు నష్టపోవడంతో తెలంగాణ తొలిస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రేడర్లలో ఒక్కో వ్యక్తి సగటు నష్టం రూ.1.45 లక్షలుగా ఉందని, దీంతో ఆ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. అంతే కాదు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో ట్రేడింగ్ చేసి నష్టపోయిన రాష్ట్రాల వారీగా చూసుకుంటే తొలి నాలుగు స్థానాల్లో దక్షిణ భారత రాష్ట్రాలో ఉన్నాయని తెలపడం గమనార్హం. రూ.1.37 లక్షల పర్ క్యాపిటల్ నష్టంతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.35 లక్షల నష్టంతో కర్ణాటక నాలుగో స్థానంలో ఉన్నట్లు సెబీ నివేదిక తెలిపింది.


ఆర్థిక సంవత్సరం 2023-24లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసిన వారిలో 93 శాతం మంది నష్టపోయారని సెబీ నివేదిక తెలిపింది. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ల సంఖ్య పరంగా చూసుకుంటే నష్టపోయిన వారిలో తెలంగాణ, ఏపీలు వరుసగా 12, 13వ స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతేడాది మొత్తంగా 2.1 లక్షల మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసినట్లు సెబీ వెల్లడించింది. ఎఫ్అండ్ ఓ ట్రేడింగ్‌లో ఎక్కువగా దక్షిణ భారత ప్రజలు నష్టపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ ఛైర్మన్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సీహెచ్ కుటుంబ రావు.


దక్షిణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐటీ, టెక్ పరిశ్రమలో పని చేస్తున్నారని, వారంతా తాము స్మార్ట్ పీపుల్‌గా భావిస్తారని, కానీ, మార్కెట్ వారికన్నా స్మార్టర్‌ అని పేర్కొన్నారు. అలాగే ఉత్తర, ఈశాన్య భారత ప్రజలు తమ డబ్బు పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. ' ట్రేడింగ్ విషయంలో యంగర్ జనరేషన్ చేస్తున్న ప్రధానమైన తప్పు ఏదంటే వారు స్టాక్ మార్కెట్ పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకపోవడమే. గత దశాబ్ద కాలంలో స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన అనిశ్చితిని చూస్తున్నాం.' అని పేర్కొన్నారు సీహెచ్ కుటుంబ రావు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com