తెలంగాణలో ఉద్యోగుల భర్తీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సుమారు 30 వేల ఉద్యోగాల విషయంలో నెలకొన్న అడ్డంకులను పూర్తిగా తొలిగించి అభ్యర్థులను నియామక పత్రాలు అందజేసి.. నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించే ప్రయత్నం చేసింది. అయితే.. డీఎససీ, గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగుల్లో కొంత ఆందోళన చెలరేగినప్పటికీ.. ప్రభుత్వం వారి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. ప్రతి ఏడాది కచ్చితంగా జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రభుత్వం పదే పదే హామీ ఇవ్వటంతో... నిరుద్యోగులు కూడా నమ్మకం పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు ప్రకటించగా.. వాటి కోసం నిరుద్యోగులు సన్నద్దమయ్యే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు త్వరలోనే మరో డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయనున్నట్టు సమాచారం ఉండటంతో వాటికి కూడా అభ్యర్థులు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు.
త్వరలో జరగనున్న గ్రూప్-2, 3 పరీక్షలతో పాటు రాబోయే పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామీణ నిరుద్యోగులకు చేయూత ఇచ్చేందుకు మంత్రి ముందుకొచ్చారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న "రైట్ ఛాయిస్ అకాడమీ" సహకారంతో "పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక" పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి విడుదల చేశారు.
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత.. ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి పిలువునిచ్చారు. పాలేరు నియోజవకర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత.. ఆగస్టు 9వ తేదీ లోపు అభ్యర్థి పేరు, గ్రామం, మండలం వివరాలను 8985096699 ఫోన్ నెంబర్కు వాట్సప్లో పంపాలని నిర్వాహకులు సూచించారు. వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని గ్రామీణ విద్యార్థుల కోసం మంత్రి పొంగులేటి ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం పట్ల నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.