ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ర్యాలీ చేసిన తెలుగు విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:17 PM

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది. శ్రీవారి ప్రసాదంలో జంతువుల, పంది కొవ్వు కలిపారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, వేంకటేశ్వరస్వామి భక్తులు, హిందూ సంఘాల నాయకులు సీరియస్‌గా ఉన్నారు. స్వామివారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఢిల్లీలో తెలుగు విద్యార్థులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తాజాగా తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆదివారం నిరసన చేపట్టారు. సనాతన ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా "ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్" పెద్దఎత్తున ర్యాలీ చేపట్టింది. ఢిల్లీ గోల్ మార్కెట్‌లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వేల మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి టీటీడీ ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టారు. తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఆలయాల పర్యవేక్షణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పీఠాధిపతులు, పండితులకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రసాదం కల్తీ అంశంపై జోక్యం చేసుకోవాలని ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సురేశ్ డిమాండ్ చేశారు. ప్రసాదం కల్టీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com