ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 09:30 PM

హైదరాబాద్ శివారు షాద్‌నగర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ఎగిసిపడిన మంటలను చూసి ప్రాణ భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అయితే.. క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించటంతో.. దట్టమైన పొగ అలుముకుని సుమారు 50 మంది కార్మికులు లోపలే ఇరుక్కుపోయారు. అయితే.. ఓ బాలుడు చేసిన సాహసం ఆ 50 మంది కార్మికుల ప్రాణాలు కాపాడింది. బిల్డింగ్‌కు ఒకవైపు పూర్తిగా మంటలు వ్యాపించడంతో.. మరోవైపు నుంచి భవనంపైకి ఎక్కి కిటికీ వద్దకు వెళ్లి తాడు కట్టాడు. ఆ తాడు సాయంతో బిల్డింగ్ లోపల ఉన్న కార్మికులు కిందికి దిగటంతో.. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అందరూ సురక్షితంగా బయపడగలిగారు. దీంతో.. ఆ బాలుడు రియల్ హీరో అయ్యాడు.


షాద్‌నగర్‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా.. నిప్పురవ్వలు ఎగిసిపడి ఫైబర్ షీట్లపై పడి మంటలు అంటుకున్నాయి. కనురెప్పపాటులో ఆ మంటలు పెద్ద రేకుల షెడ్ మొత్తానికి వ్యాపించాయి. దానికి ఆనుకుని ఉన్న భవనంలో సుమారు 300 మంది కార్మికులు ఉన్నారు.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసే పనిలో పడ్డారు. అలాగే భవనంలో చిక్కుకున్నవారిని నిచ్చెన సహాయంతో కిందికి దించే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో స్థానిక బాలుడు సాయిచరణ్ సమయస్ఫూర్తితో ఆలోచించి.. సాహసం చేశాడు. భవనం ఒకవైపుకు వెళ్లి.. ఒక పెద్ద తాడుతో భవనంపైకి ఎక్కి కిటికీకి దాన్ని కట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న 50 మంది కార్మికులు తాడు సాయంతో కిందికి దిగారు. ఒకవేళ సాయిచరణ్ ఆ తాడు కట్టి ఉండకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది.


సాయిచరణ్ సమయస్పూర్తిని, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి.. సాయిచరణ్‌ను అభినందించారు. ఈరోజు రియల్ హీరో సాయిచరణ్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం వివరాలు తెలిసే అవకాశముంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com