ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 08:01 PM

పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు.. బంధుమిత్రుల హడావుడి, వధూవరుల సందడే కాదు కాదు.. వివాహంలో పెట్టే భోజనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. తమ పెళ్లికి వచ్చిన బంధువులంతా.. తాము ఇచ్చే విందు భోజనాలను తృప్తిగా ఆరగించి.. వధూవరులను మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటారు. అయితే.. తాము పెట్టే విందు గురించి వచ్చిన వాళ్లంతా అందరూ చెప్పుకోవాలన్న ఉద్దేశంతో.. రకరకాల వంటకాలు పెడుతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా సరే వెచ్చిస్తుంటారు. కొందరు ధనవంతులు ప్లేట్‌లో కూడా పట్టనన్ని ఐటెమ్స్ పెడతారు. అయితే.. వింధులో స్వీట్లు, ఐస్ క్రీమ్స్, ఇంకా అంటే కూల్ డ్రింక్స్ ఇస్తుండటం చూశాం. ఈ కోవలోనే ఓ కుటుంబం మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు, చెరుకు గడలు ఏర్పాటుచేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.


రంగారెడ్డి జిల్లా తుర్క యంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని బీఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో అతిథుల కోసం తాటిముంజలు పెళ్లివాళ్లు ఏర్పాటుచేశారు. ఎండలు మండిపోతున్న వేళ తమ వేడుకకు వచ్చే బంధువులకు చల్లచల్లాగా ఏదైనా ఇవ్వాలని ఆలోచించినప్పుడు.. ఐస్ క్రీం, కూల్ డ్రింక్ ఇలా రోటీన్‌గా కాకుండా.. సమ్మర్ సీజన్‌లో దొరికే తాటిముంజలు, చెరుకు గడలు ఇవ్వాలని నిర్ణయించుకుని.. తెప్పించారు.


అయితే.. రిసెప్షన్‌కు వచ్చిన వారంతా తాటిముంజలను చూసి ముందు అవాక్కైనా.. ఈ కొత్త కాన్సెప్ట్ బాగుందే అంటూ తాటిముంజలని ఇష్టంగా తిన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటిముంజలను వ్యాపారులు హైదరాబాద్‌కు తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముతుంటారు. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసిన వారు ఎంత ధరైనా సరే పెట్టి కొనడానికి వెనుకాడరు.


 అయితే తాటిముంజలను ఇలా విందులో వాటిని వడ్డించడం మాత్రం కొత్తగా అనిపిస్తోందని పెళ్లికి హాజరైన అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐస్‌ క్రీంలు, కూల్ డ్రింకులు వచ్చిన తర్వాత ఇలాంటివి తినటం చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే.. ఏకంగా రిసెప్షన్ విందులో తాటిముంజలు ఏర్పాటు చేయడం భలేగుంది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com