భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 2. 63కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించానని తెలిపారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, డివిజన్ హయత్ నగర్ పరిధిలో సుమారు 15 కిలో మీటర్ల మేర నూతన మంచినీటి పైప్ లైన్లు వేశామని, మరో 10కిలో మీటర్ల పనులు జరుగుతున్నాయన్నారు. వర్షపు నీరు కాలనీల్లో చేరకుండా క్రీడా నుంచి హతిగూడ చెరువు వరకు వరద కాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపడతామన్నారు.