ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖైరానీ రోడ్డులో ఘోరం జరిగింది. ఆ రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. దాదాపు అయిదు గంటల పాటు అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారిని ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఇవాళ ఉదయం 4.15 నిమిషాలకు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. వార్నింగ్ సంకేతాలు రాగానే.. అగ్ని మాపక సిబ్బంది మొదట మూడు ఫైరింజన్లను పంపారు. బిల్డింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ వైరింగ్, తినుబండారాలు మంటల్లో బూడిదయ్యాయి. షాపులో సుమారు 10 నుంచి 15 మంది ఉంటారని దాని ఓనర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.