బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో బండరాళ్లు పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడ్రోజుల వ్యవధిలో జిల్లాలో ఇది రెండో క్వారీ ప్రమాదం. ఇటీవల కొండపల్లి మండలం గరుడబిల్లి క్వారీలో ప్రమాదం జరిగి ఒక కార్మికుడు మృతి చెందాడు. క్వారీల్లో భద్రతపై నివేదిక అందేవరకు తవ్వకాలు ఆపాలని రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆదేశించిన మరుసటి రోజే ప్రమాదం జరగడం గమనార్హం.