అహ్మదాబాద్ : పాటిదార్ అనామత్ ఆందోళన సమితి (పిఎఎఎస్-పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ నేడు అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించారు. శాంతిభద్రతల అంశాన్ని పేర్కొంటూ పోలీసులు ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ తదితరులకు రోడ్ షో నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయలేదు. అయినప్పటికీ హార్దిక్ పటేల్ రోడ్ షో నిర్వహించారు. హార్దిక్ మద్దతుదారులు వందలాదిమంది మోటార్ సైకిళ్లు, కార్లలో తిరుగుతూ 15 కిలోమీటర్ల రోడ్షోను నిర్వహించారు. హార్దిక్ పటేల్ రోడ్ షో నిర్వహించడానికి తాము అనుమతి మంజూరు చేయలేదని, అయితే ఆయన మద్దతుదారులు రోడ్ షో నిర్వహించడం ద్వారా తమ నిబంధనను ఉల్లంఘించారని, వారిపై తాము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఎ.కె. సింగ్ చెప్పారు.