అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న అభ్యంతరాలకు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ మంత్రులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలవరంపై సుప్రీంకోర్టుకు ఒడిశా సర్కార్ రాసిన లేఖపై సీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటామని ఒడిశా సర్కార్ సూచిస్తోందన్న అధికారులు చంద్రబాబుకు వివరించారు. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త ట్విస్ట్ అని చంద్రబాబు కామెంట్ చేశారు. సీఎంల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానేనని, కేంద్రం సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తే మనకూ మంచిదేనన్న చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. ఛత్తీస్గఢ్ సీఎం ప్రస్తుతం సైలెంట్ అయ్యారని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.