న్యూఢిల్లీ : స్వదేశీ ఎఫ్ఎంసీజి ఉత్పత్తుల వ్యాపారంలో శరవేగంగా దూసుకెళ్తున్న యోగా గురువు బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఇప్పుడు సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. హరిద్వార్ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న పతంజలి ఈ ఏడాది ఆరంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్ సంస్థను కొనుగోలు చేసింది. సౌర విద్యుత్ పరికరాల తయారీ కోసం తమ సంస్థ గ్రేటర్ నోయిడాలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందని, దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో కార్యకలాపాలను మొదలుపెట్టనున్న ఈ యూనిట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఈ యూనిట్ కోసం ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వెచ్చించామని, మొత్తం పెట్టుబడులు రూ.100 కోట్లు దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
సోలార్ ప్యానళ్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో సోలార్ చిప్స్, ఫొటోవోల్టాయిక్ సెల్స్ లాంటి పరికరాలను కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నామని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆరంభంలో ఈ పరికరాల తయారీ కోసం దేశీయ ఉత్పత్తిదారుల నుంచి విడి భాగాలను కొనుగోలు చేస్తామని, ఆ తర్వాత ఈ విడి భాగాలను తమ సంస్థే తయారు చేస్తుందని, ఇందుకు అవసరమైన యంత్రాలను జర్మనీ, చైనా నుంచి తెప్పించి ఇన్స్టాల్ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇదిలావుంటే, భారత్లో ఏర్పాటు చేస్తున్న అల్రా మెగా సోలార్ ప్రాజెక్టు గురించి ఈ వారం ఫ్రాన్స్లో జరుగనున్న ఏక గ్రహ (వన్ ప్లానెట్) శిఖరాగ్ర సదస్సులో చర్చించబోతున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ వెల్లడించారు.