ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో పతంజలి సౌర విద్యుత్ పరికరాల తయారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 08:37 AM

న్యూఢిల్లీ : స్వదేశీ ఎఫ్‌ఎంసీజి ఉత్పత్తుల వ్యాపారంలో శరవేగంగా దూసుకెళ్తున్న యోగా గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఇప్పుడు సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. హరిద్వార్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న పతంజలి ఈ ఏడాది ఆరంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్ సంస్థను కొనుగోలు చేసింది. సౌర విద్యుత్ పరికరాల తయారీ కోసం తమ సంస్థ గ్రేటర్ నోయిడాలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందని, దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో కార్యకలాపాలను మొదలుపెట్టనున్న ఈ యూనిట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఈ యూనిట్ కోసం ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వెచ్చించామని, మొత్తం పెట్టుబడులు రూ.100 కోట్లు దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు.


సోలార్ ప్యానళ్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సోలార్ చిప్స్, ఫొటోవోల్టాయిక్ సెల్స్ లాంటి పరికరాలను కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నామని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆరంభంలో ఈ పరికరాల తయారీ కోసం దేశీయ ఉత్పత్తిదారుల నుంచి విడి భాగాలను కొనుగోలు చేస్తామని, ఆ తర్వాత ఈ విడి భాగాలను తమ సంస్థే తయారు చేస్తుందని, ఇందుకు అవసరమైన యంత్రాలను జర్మనీ, చైనా నుంచి తెప్పించి ఇన్‌స్టాల్ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇదిలావుంటే, భారత్‌లో ఏర్పాటు చేస్తున్న అల్రా మెగా సోలార్ ప్రాజెక్టు గురించి ఈ వారం ఫ్రాన్స్‌లో జరుగనున్న ఏక గ్రహ (వన్ ప్లానెట్) శిఖరాగ్ర సదస్సులో చర్చించబోతున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com