ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిదంబరం కుటుంబానికి వెంటాడుతున్న సీబీఐ కేసులు

national |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 10:14 PM

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పి.చిదంబరం కుటుంబానికి సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై.. చైనీయులకు వీసా ఇచ్చేందుకు రూ.50 లక్షలు తీసుకున్నారనే అభియోగాలతో మరో కేసు పెట్టారు. 2010-14 మధ్య పవర్ ప్రాజెక్ట్ కోసం 250 మంది చైనీయులకు వీసా ఇప్పించడం కోసం కార్తీ రూ.50 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగంపై కొత్త కేసు నమోదైందని సమాచారం.


కార్తీ లావాదేవీలను పరిశీలించిన సీబీఐ.. చైనీస్ వర్కర్లకు వీసా మంజూరు చేయించినందుకు గానూ రూ.50 లక్షల నగదు ఆయన ఖాతాలోకి మళ్లినట్లు గుర్తించింది. దీని ఆధారంగా చెన్నై‌లోని మూడు ప్రదేశాలు, ముంబైలోని మూడు ప్రదేశాలు, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌ల్లో ఒక్కో ప్రదేశంలో సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు.


ఢిల్లీలోని 80 లోధి ఎస్టేట్‌లోని చిదంబరం నివాసంలో సీబీఐ సోమవారం ఉదయం దాడులు చేసింది. ఎంపీ నివాసంలో ఉన్న సిబ్బందిని ప్రశ్నించిన సీబీఐ.. కొన్ని పత్రాలను తమ వెంట తీసుకెళ్లింది.


‘సీబీఐ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఉదయం 7.30 గంటలకు సోదాలు జరిగిన సమయంలో కార్తీ చిదంబరం ఇంట్లో లేరు’ అని సెక్యూరిటీ గార్డ్ బీర్బల్ సింగ్ తెలిపారు. కార్తీ నివాసం, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది.


ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బిల్లు (ఎఫ్ఐపీబీ) గ్రాంట్ విషయంలో నిబంధనలను పాటించలేదనే కారణంతో 2017లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ నివాసంలో సీబీఐ సోదాలు జరిపింది. చెన్నైలోని చిదంబరం నివాసం సహా 17 ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com