-జయ కేసులో అపోలో ఆసుపత్రి యాజమాన్యం సమాధానం
-జయలలిత మరణంపై పలుసందేహాలున్నాయంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అపోలోకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ
-మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా విధించిన నిబంధనల మేరకే నిర్ణయం
చెనై్న: జయలలిత స్వయంగా కోరినందు వలనే ఆమె ఫొటో విడుదల చేయలేదని ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత ఏడాది సెప్టెంబర్ 22 న చెనై్నలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల పాటు చికిత్స పొంది డిసెంబరు 5 వ తేదీన జయలలిత మరణించారు. జయలలిత మరణంపై పలు సందేహాలున్నాయంటూ జోసెఫ్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జయలలిత మృతికి సంబంధించి విచారణ కమిషన్ వేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. జయలలితకు అందించిన చికిత్సపై నివేదికల్ని సీల్డు కవర్లో కోర్టుకు సమర్పిస్తామని అపోలో ఆసుపత్రి గతంలో కోర్టుకు తెలిపింది. ఈ కేసు గురువారం మద్రాస్ హైకోర్ట ప్రధాన నాయమూర్తి జస్టిస్ జి రమేష్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. గతంలో పేర్కొన్నట్లు సీల్డ కవర్ లో కాకుండా అపోలో ఆసుపత్రి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చికిత్స పొందుతున్న వ్యక్తికి సంబంధించిన గోప్యతపై మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా కొన్ని నిబంధనల్ని విధించిందని తెలిపారు. వాటిని అనుసరించి జయలలితకు అందించిన చికిత్స వివరాలు బయటకు తెలపలేదన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు సైతం ఆమె అనుమతితోనే విడుదల చేసినట్లు అపోలో ఆసుపత్రి తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తన ఫోటోలను విడుదల చెయ్యరాదంటూ జయలలిత స్వయంగా కోరినందు వలనే ఆమె ఫోటోలను విడుదల చెయ్యలేదంటూ అపోలో ఆసుపత్రి కోర్టుకు తెలిపింది. కేవలం అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులే కాక ఢిల్లీ ఎయిమ్స కు చెందిన వైద్యులు, లండన్ కు చెందిన వైద్య నిపుణులు కూడా జయలలితకు చికిత్స అందించినట్లు అపోలో ఆసుపత్రి, తమిళనాడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ్ కార్యదర్శి రాధాకృష్ణన్ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. జయలలితకు అపోలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన అఫిడవిట్ కు పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్, అపోలో అఫిడవిట్ ఒకేలా ఉన్నాయని తెలిపారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అందించేందుకు మరో రెండు వారాల సమయం కావాల్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఈ కేసును వచ్చేనెల 13 వతేదీకి మద్రాస్ హైకోర్ట వాయిదా వేసింది.