హైదరాబాద్ : నేరుగా బంగారం కొనకుండా భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేయాలనుకునే వారు సార్వభౌమ బంగారం బాండ్లు 2016-17 పథకాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఏడవ విడత బాండ్లు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి అవకాశం. కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ సంయుక్తంగా సార్వభౌమ పసిడి బాండ్లు విడుదల చేయాలని నిర్ణయించాయి. 2016-17 సీరీస్లో ఇవి లభిస్తాయి. ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇందులో 500 గ్రాముల వరకూ బంగానం సెక్యురిటీలను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన తపాలా కార్యాలయాలు, ఎన్ఎస్ఇ, బిఎస్ఇల ద్వారా బాండ్లను విక్రయించనున్నారు. ప్రారంభ పెట్టుబడి మొత్తంపై 2.75 శాతం వార్షిక వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. వీటి వ్యవధి 8 ఏళ్లు. ముందుగానే తీసుకోవాలంటే 5 ఏళ్ల తరువాత అవకాశం ఉంది.