ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతాకుతలమవుతున్న అండమాన్ నికోబార్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:13 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌లా మారింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై విరుచుకుపడుతోంది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ ఉగ్రరూపాన్ని ధరిస్తోందీ తుఫాన్. భారీ వర్షాలతో అండమాన్ నికోబార్ అతలాకుతలమౌతోంది. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్‌ తీర ప్రాంతాలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ఇప్పుడు తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీనికి అసానీ తుఫాన్ (Cyclone Asani)గా నామకరణం చేశారు. కార్ నికోబార్‌కు ఆగ్నేయ దిశగా 200 కిలోమీటర్లు, పోర్ట్ బ్లెయిర్‌కు ఈశాన్య దిశగా 100 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో పెను తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతోంది. ఈ తెల్లవారు జామున అండమాన్ నికోబార్ తీరానికి మరింత చేరువైంది. దీని ప్రభావంతో అక్కడ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్ట్ బ్లెయిర్ సహా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోర్ట్ బ్లెయిర్, ఫెర్రార్‌గంజ్, జిర్కాటంగ్, కార్ నికోబార్, లిటిల్ అండమాన్, హేవ్‌లాక్ ఐలండ్‌లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ప్రస్తుతానికి ఈదురు గాలుల తీవ్రత గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం మరింత పెరుగుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. తీరానికి చేరిన తరువాత ఇది బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం సైంటిస్ట్ ఆర్‌కే జనమణి తెలిపారు. ఈ సాయంత్రానికి తుఫాన్ తీరానికి సమీపించే అవకాశం ఉందని చెప్పారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అండమాన్ నికోబార్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తదుపరి ఉత్తర్వులు వెలువడించేంత వరకు సముద్రంపై చేపలవేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులను ఆదేశించింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం- జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను పోర్ట్ బ్లెయిర్‌కు తరలించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలను ముమ్మరం చేసింది. అదనపు బలగాలను కూడా సిద్ధం చేసింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన వారిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెనక్కి మళ్లించారు. హెలికాప్టర్లలో సముద్రం మీదుగా తిరుగుతూ మైక్‌ల ద్వారా హెచ్చరికలను జారీ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com