దీపావళి రోజు రాత్రి తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని కాలుష్యం కమ్మేసింది. బాణసంచా కాల్చడంతోగురువారం రాత్రి నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్ల వరకు అధికంగా కాలుష్యం ఏర్పడిందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బాణసంచా నుంచి వెలువడిన రసాయనాల కారణంగా విపరీతంగా పొగ వ్యాపించిందని సీపీఆర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ జాయింట్ డైర్టెర్ సుధాకర్ తెలిపారు.
‘చావు.. బతుకు’ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. బాణసంచాపై నిషేధం విధించడం ఉత్తమం’ అని కెవిన్ ఫ్రాంక్లిన్ అనే విద్యార్థి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా బాణసంచాపై నిషేధం విధిస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెన్నై వాసులు అభిప్రాయపడుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రిచేందుకు దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.