కేంద్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కరోనా టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను పంపిణీ చేయనుంది. 12 ఏళ్లు పైబడినవారు రేపటి నుంచి కొవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా www.cowin.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత అందులో Register Yourself అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డులు అందుబాటులో లేకపోతే పిల్లలు తమ విద్యార్థి ఐడీ కార్డులను ఉపయోగించవచ్చు.
- పిల్లలు వారి కుటుంబ సభ్యులతో లేదా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒక మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ‘Schedule appointment’ అని బటన్ క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ పేజీకి వెళ్తుంది. అక్కడ రాష్ట్రం, జిల్లా, పిన్కోడ్ ఎంటర్ చేసి మీ సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. మీకు దగ్గరలోని కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన్ ను క్లిక్ చేస్తే అపాయింట్ మెంట్ లభిస్తుంది.