అనంతపురం జిల్లా పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్ లో ఉంచిన శ్రీగంధం చెక్కలు చోరీ కేసులో ఏ 1 బాబాజన్, ఏ 2 సెల్వకుమార్ లను పెనుకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా మంగళవారం పెనుకొండ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెనుకొండ డి ఎస్ పి ఎన్. రమ్య అందించిన వివరాలు మేరకు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండీ రూ. 16 లక్షల విలువ చేసే శ్రీగంధం ఆయిల్ , 14 సంచుల శ్రీగంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ. 2, 600 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ రూ. 27 లక్షలు ఉంటుందన్నారు.
ఈ ఏడాది జనవరి 24 న ఇదే కేసులో ఏడుగుర్ని అరెస్టు చేసి 68 సంచుల శ్రీగంధం చెక్కలు, రెండు ఐచర్ లారీలు, కారు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెనుకొండ ఫారెస్టు ఆఫీస్ లో చోరీ అయిన 92 శ్రీగంధం చెక్కల సంచులు, శ్రీగంధం ఆయిల్ కేసులో తాజాగా స్వాధీనం చేసుకున్న వాటితో కలిపి 82 సంచుల శ్రీగంధం చెక్కలు, శ్రీగంధం ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సీఐ వెంకటేశ్వర్లు, హిందూపురం రూరల్ సీఐ తో పాటు పెనుకొండ, సోమందేపల్లి ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.