దాదాపు ఐదేళ్ల పాటు ఉగ్రవాదుల చెరలో మగ్గిపోయిన జాషువా బాయిల్ తన కుటుంబానికి ఎదురైన భయానకమైన ఘటనలను గుర్తు చేసుకున్నారు. తాలిబన్ల నుంచి సురక్షితంగా బయటపడిన జాషువా కుటుంబం శుక్రవారం కెనడా చేరుకుంది. ఈ సందర్భంగా బాయిల్ అక్కడి మీడియాతో మాట్లాడాడు. ‘గర్భిణీ అని కూడా చూడకుండా ఉగ్రవాదులు నా భార్య పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. కర్కశంగా నా బిడ్డను చంపేశారు’ అని బాయిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బాయిల్ డిమాండ్ చేశాడు. ‘అమెరికా సిబ్బంది మా వెంటే రక్షణగా ఉంటూ జాగ్రత్తగా కెనడా చేర్చారు. అందుకు వారికి కృతజ్ఞతలు’ అని బాయిల్ తెలిపారు.
కెనడాకి చెందిన జాషువా బాయిల్, ఆయన భార్య కెయిట్లాన్ కోల్మన్లను 2012లో ఆఫ్గానిస్థాన్లో తాలిబన్ అనుబంధ ముఠా అయిన హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదులు అపహరించారు. అప్పటికే కోలోమన్ గర్భిణిగా ఉంది. బందీలుగా ఉన్నప్పుడే ఆ జంటకు ముగ్గురు పిల్లలు జన్మించారు. నాలుగో సంతానంగా పుట్టిన బిడ్డను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అప్పటి నుంచి వారిని విడిపించేందుకు అమెరికా నిఘా సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయి. యూఎస్ సహాయంతో పాక్ ఎట్టకేలకు గురువారం వారిని సురక్షితంగా కాపాడింది.