అమరావతి: రాష్ట్ర నూతన డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)గా ఏపీ సీఆర్డీయే డెవల్పమెంట్ ప్రమోషన్ విభాగపు డైరెక్టర్గా వి.రాముడిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులను కూడబెట్టిన కేసులో గతనెల చివర్లో అప్పటి డీటీసీపీ రఘును ఏసీబీ అరెస్టు చేసినప్పటి నుంచి దాదాపు 15 రోజులుగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో పలు బాధ్యతలను నిర్వర్తించి, సుమారు రెండున్నరేళ్ల క్రితం సీఆర్డీయేకు బదిలీ అయిన రాముడు.. డెవల్పమెంట్ కంట్రోల్ విభాగంతోపాటు కొన్ని నెలలపాటు ప్లానింగ్ విభాగపు బాధ్యతలను నిర్వహించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో చురుగ్గా వ్యవహరించారు. వీజీటీఎం ఉడా హయాం నుంచి పేరుకుపోయిన సుమారు 70వేల ఫైళ్లను డిజిటలైజేషన్ చేయించారు. ప్లాన్లకు సత్వర, పారదర్శక అనుమతుల కోసం ఓపెన్ ఫోరం, డెవల్పమెంట్ ఫెసిలిటేషన్ సెంటర్ తదితరాలను ప్రారంభించి, క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.