మానవ వనరుల అభివృద్దిలో తనదైన భూమిక పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ తాజాగా గైడ్ల శిక్షణకు క్యాలెండర్ విడుదల చేసింది. పర్యాటకులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందిస్తూ అయా ప్రాంతాలలో పర్యాటకులకు దిక్సూచిగా గైడ్లు వ్యవహరిస్తుండగా, నిపుణులైన గైడ్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ సోమవారం విశాఖపట్నం వేదికగా స్టేట్ టూరిస్ట్ గైడ్ శిక్షణను ప్రారంభించింది. ఇందులో ఇరవై మందికి అవకాశం ఉండగా, వీరికి 75 రోజుల పాటు శిక్షణ అందించనున్నామని అధారిటీ సిఇఓ హిమాన్హు శుక్లా తెలిపారు. శిక్షణా కాలంలో వీరికి ఉచిత వసతి, భోజనంతో పాటు ప్రతినెల వేతనం కూడా అందిస్తామన్నారు. అక్టోబరు 12 నుండి స్వగృహ పుడ్స్ తయారీ, 17 నుండి ప్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, క్యాబ్ డ్రైవర్స్ ట్రైనింగ్, 19 నుండి హౌస్ కీపింగ్లలో ప్రతి బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ అందిస్తామన్నారు. మరోవైపు విశాఖపట్నంతో పాటు ఏలూరు, రాజమండ్రిలలో కూడా పర్యాటక, అతిధ్య రంగ శిక్షణా కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని హిమాన్హు శుక్లా వివరించారు. ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా స్వయం ఉపాధిని పొందగలుగుతారని, అదే క్రమంలో పర్యాటక శాఖ సైతం వారిని ప్రోత్సహిస్తుందన్నారు. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన స్టేట్ టూరిస్ట్ గైడ్లలకు తగిన పరీక్షలు, ఇంటర్వూ తదుపరి ఐదు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అయ్యేలా పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ గైడ్ లైసెన్సును అందిస్తుందన్నారు.