ముంబయి: ముంబయి తీరానికి సమీపంలోని బచర్ ద్వీపంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ద్వీపంలో నిల్వ చేసిన ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో ద్వీపమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.
బచర్ ద్వీపంలో ముంబయి పోర్టు ట్రస్ట్కు చెందిన ఇంధన నిల్వలు ఉన్నాయి. అక్కడ భారీ ట్యాంకుల్లో ఇంధనాన్ని నిల్వ చేస్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ట్యాంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వీపం నుంచి ఎగిసిపడుతున్న మంటలను గుర్తించిన తీరప్రాంత ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదం కారణంగా ట్యాంకులో వేడి పెరిగిపోయి తెల్లవారుజామున మళ్లీ మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.